Clock Of Nellore ( Nellore ) – భారత దేశ స్వాతంత్య్ర సమరంలో అసువులు బాసిన మహనీయుల జీవిత చరిత్రను, దేశ స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో దేశభక్తి భావం పెంపొందించే విధంగా ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను మంత్రి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించి తిలకించారు. ఈ ఛాయా చిత్ర ప్రదర్శనలో దేశంలోని, రాష్ట్రంలోని స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు, స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్ర, జాతీయ పతాకం రూపకల్పన, జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు, పురాతన చారిత్రాత్మక కట్టడాలు తదితర అంశాలపై ఛాయా చిత్రాలను ప్రదర్శించడం జరిగింది. ప్రజలు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను ఎంతో ఆసక్తి తో తిలకించారు.

ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు సంవత్సరం పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదని, ఆగస్టు 15 తేది తో ఈ వేడుకలు పూర్తి అవుతాయన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో తృణప్రాయంగా ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులను, త్యాగధనులను స్మరించుకుంటూ
దేశభక్తి భావాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను సమాజంలో ఉన్న ప్రజలు ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థిని విద్యార్థులు తిలకించి స్వాతంత్య్ర ఉద్యమ చారిత్రిక ఘట్టాలను, మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు. చాయా చిత్ర ప్రదర్శనను సంయుక్తంగా ఏర్పాటు చేసిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా విద్యా శాఖ అధికారులకు, సిబ్బందికి మంత్రి గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు.
