Clock Of Nellore ( Gudur ) – తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం, రామలింగా పురంలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు అతని డెడ్ బాడీని గోనె సంచిలో కుక్కి మూట కట్టి సమీపంలోని కాలువలో పడేసి వెళ్లిపోయారు ( Gudur Murder ). సంచి చిరిగి మృతదేహం బయటకు కనిపిస్తుండగా ఇవాళ ఉదయం కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోనె సంచిని బయటకు తీసి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. హతుడు చిల్లకూరుకు చెందిన జవహార్ బాషాగా గుర్తించారు. రెండు రోజుల క్రితం జవహార్ బాషా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన గూడూరు రూరల్ పోలీసులు హత్య ఎవరు చేశారు అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడు జవహార్ బాషా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 ఏళ్ల క్రితమే భార్యతో విడిపోయి ప్రస్తుతం తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
