Clock Of Nellore ( Amaravathi ) – ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన మంగళగిరి టిడిపి కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని, ఏ1, ఏ2 బినామీ కంపెనీల కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతున్నారని ఆరోపించారు. హెరిటేజ్ పాలతో కల్తీ మద్యం బ్రాండ్లను పోలుస్తారా? అని ప్రశ్నించారు. బేవరేజస్ ఫోరెన్సిక్ ఆడిట్ కి సర్కార్ సిద్ధమా ? అని ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు.
మంత్రి విడదల రజని మద్యపాన నిషేధంపై చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఆదాన్ విస్కీని రూ.36కు కొని రూ.200కి అమ్ముతున్నారని, విషపూరిత మందును రూ.36కే తయారు చేస్తున్నారని, దానివల్ల ఆరోగ్యాలు చెడిపోక ఏముంటుందని అన్నారు. ఇలాంటి విషపూరిత మందులు తాగొద్దని ప్రజలకు మనవి చేస్తున్నానన్నారు. భారతదేశంలో ఉండే బ్రాండ్లలో ఒక్క బ్రాండ్ కూడా ఏపీలో కనిపించడం లేదని విమర్శించారు. ఏపీలోని కల్తీ బ్రాండ్లపై మూడు నెలలుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆనం వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.