Clock Of Nellore ( Nellore ) – బాపట్ల జిల్లా రేపల్లెలో ఇద్దరు వ్యక్తులు మరణించగా వారు కల్తీ మద్యం తాగే మృత్యువాత పడ్డారని తెలుగుదేశం ఆరోపించింది. ఈ నేపద్యంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందుగానే సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు… ఆదివారం తెల్లవారు జామునే నెల్లూరు చింతారెడ్డిపాళెంలోని ఆనం నివాసానికి చేరుకున్నారు. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు వెంకటరమణారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, టిడిపి కార్యకర్తల మధ్య కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మాత్రం వెంకటరమణారెడ్డి ఇంటి నుండి బయటకు పంపలేదు. దీనిపై రమణారెడ్డి మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే రేపల్లెలో ఇద్దరూ చనిపోయారని, తక్షణం మద్యం తయారు చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన బేవరేజన్ నుండే కల్తీ మద్యం తయారవుతుందని ఆరోపించారు.
