Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుసిటీ నియోజకవర్గంలో ఈనెల 17వ తేదీ నుండి పవనన్న ప్రజాబాట పేరుతో సంవత్సరం రోజుల పాటూ ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రకటించారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పవనన్న ప్రజాబాట పేరుతో తాను నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తానని చెప్పారు. కార్యక్రమానికి సంభందించిన కర పత్రాన్ని కూడా విడుదల చేశారు. 17వ తేదీనా నెల్లూరులోని 3వ డివిజన్ వేణుగోపాల్ నగర్ నుండి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఎందుకు కావాలో కూడా ప్రజలకు వివరిస్తానన్నారు. మూడేళ్ల వైసీపి పాలనలో అభివృద్ది శూన్యమని.. నెల్లూరులో ఏం అభివృద్ధి జరిగిందో మాజీ మంత్రి అనీల్ తెలపాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరమే కాదు రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదని ఆ విషయం ప్రజలందరికీ తెలుసునని వినోద్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు నలిశెట్టి శ్రీధర్, ప్రవీణ్, పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, ఏటూరు రవి, కారంపూడి కృష్ణారెడ్డి, కాకు మురళీ రెడ్డి, చింతంరెడ్డి శిరీషారెడ్డి, షేక్ ఆలియా తదితరులు పాల్గొన్నారు.
