Clock Of Nellore ( Gudur ) – ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి నమ్మి పని కల్పిస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు ఓ నమ్మకద్రోహి. నమ్మకంగా ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓ స్వీట్ షాపులో మాస్టర్ గా పనిచేసే కైలాసం రాజా రెడ్డి అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారి అప్పుల పాలైనాడు. అప్పులు చెల్లించేందుకు ఒత్తిడి పెరగడంతో యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. గత నెల 28వ తేదీ మరో వ్యక్తితో కలిసి యజమాని ఆయన సతీమణి షాపులో ఉన్న సమయంలో యజమాని ఇంటికి వెళ్లాడు. బీరువా తెరిచి అందులో ఉన్న బంగారు నల్లపూసల దండ, నాలుగు బంగారు గాజులు, రెండు జతల బంగారు కమ్మలు, ఓ ఉంగరాన్ని చోరీ చేసి అక్కడి నుండి పరారయ్యాడు. ఇంటికొచ్చిన యజమాని చోరీ విషయాన్ని గుర్తించి గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిన్న నిందితుడు కైలాసం రాజారెడ్డిని అదుపులోకి తీసుకుని చోరీ అయిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఇవాళ గూడూరు రూరల్ సిఐ శ్రీనివాస రెడ్డి, ఎస్సై బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. రాజారెడ్డిని అరెస్ట్ చేశామని, మరో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు.