Clock Of Nellore ( Nellore ) – గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అబివృద్ది కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరెందిర ప్రసాద్ లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సంధర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి, మహాత్మా గాంధీ చిత్రా పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసినప్పుడే గ్రామాల అభివృద్ది జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు అంధించడలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకమని, ఈ వ్యవస్థని బలోపేతం చేసేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థ లో అనేక మార్పులను తీసుకు రావడం జరిగిందని, పంచాయతీ రాజ్ వ్యవస్థతో తన కుటుంబానికి వున్న అనుబంధాన్ని ఈ సందర్బంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. గ్రామంలో సర్పంచులకు హక్కుల కంటే భాధ్యతలు వున్నాయని, వారు ఆయా గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినట్లైతే ఆ గ్రామాలు నవసమాజ స్థాపన వైపు అడుగులు వేస్తాయని మంత్రి అన్నారు. పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు గ్రామీణ ప్రజలకు అందించే భాద్యతలో పంచాయతీ రాజ్ వ్యవస్థను చేర్చడం తో పాటు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజల ముంగిటకే చేర్చేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని మంత్రి గోవర్ధన్ రెడ్డి వివరించారు.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తన నియోజక వర్గ పరిధిలోని కలిగిరి గ్రామానికి అవార్డు రావడం సంతోషమన్నారు. పేద ప్రజలు బాగుండాలంటే గ్రామాలను అబివృద్ది చేయడమే నన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి గ్రామంలోని పేద ప్రజలకు అవసరమైన సేవలను, సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరుగుచున్నదని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.
కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, మన దేశంలో నిజమైన భారతీయ వాదం గ్రామీణ ప్రాంతంలోనే వుందని, మహాత్మా గాంధీ కలలు కన్నా స్వరాజ్యం కూడా గ్రామాల నుండే రావాలన్నారు. గ్రామాలలో మెరుగైన సేవలు ప్రజలకు అందాలంటే పటిష్టమైన పంచాయతీ రాజ్ వ్యవస్థ అవసరమన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే దేశానికే తలమానికంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను నేరుగా ప్రజా ఇంటి వద్దకే చేర్చడం జరుగుచున్నదన్నారు. నేడు ఎలాంటి లోటుపాట్లుకు తావులేకుండా గ్రామీణ ప్రజలకు సేవలందించడంలో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు ఎనలేని సేవలందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సచివాలయ మరియు వాలంటీర్ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయడం జరిగిందన్నారు. స్వచ్చ సంకల్ప కార్యక్రమంలో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందని, జాతీయ స్థాయిలో మూడు అవార్డులు రావడం ఎంతో సంతోషం అని కలెక్టర్ అన్నారు.

ఈ సంధర్భంగా జాతీయ అవార్డు పొందిన కలిగిరి, ఏ.ఎస్.పేట గ్రామాలకు చెందిన సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు మంత్రి గోవర్ధన్ రెడ్డి అవార్డులను అందచేశారు. ఈ కార్యాక్రమంలో జిల్లా పంచాయతీ శాఖ అధికారి ధనలక్ష్మి, జడ్పీ సి.ఈ ఓ వాణి, డి.ఆర్.డి.ఏ మరియు డ్వామా పి.డి.లు సాంబ శివా రెడ్డి, తిరుపతయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. రాజ్యలక్ష్మి, వివిద శాఖల అధికారులు, వివిద మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.