Clock Of Nellore ( Nellore ) – అనకాపల్లి నుంచి చిత్తూరుకు లారీలో 432 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా నెల్లూరుజిల్లా పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరురూరల్ సిఐ జగన్మోహన్ రావుకు గంజాయి తరలింపు సమాచారం రావడంతో డిఎస్పీ హరినాథ్ రెడ్డి పర్యవేక్షణలో వెంకటాచలం పోలీసులు గంజాయి ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో గంజాయి లోడు ఉన్న లారీ జాతీయ రహదారిపై నెల్లూరు రూరల్ ప్రదేశానికి ప్రవేశించింది. పోలీసుల రాకను గమనించిన విశాఖపట్నంకు చెందిన డ్రైవర్ గుడపర్తి వరహాలు లారీని వేగంగా నడపసాగాడు. పోలీసులు లారీని ఛేజ్ చేస్తూ వెంకటాచలం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన వెంకటాచలం ఎస్సై, సిబ్బంది టోల్ ప్లాజా వద్ద లారీని ఆపి డ్రైవర్ వరహాలును అదుపులోకి తీసుకున్నారు. లారీని తనిఖీ చేయగా 21 లక్షల విలువైన 432 కేజీల గంజాయి లభించింది. దీంతో లారీ, గంజాయి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం జిల్లా అదనపు ఎస్పీ వెంకట రత్నం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను తెలియజేశారు. విశాఖపట్నంకు చెందిన వరహాలు చెడు వ్యసనాలకు బానికగా మారి డబ్బు కోసం గంజాయి అక్రమ రవాణాను చేపడుతున్నాడని చెప్పారు. విశాఖలోని అనకాపల్లి నుండి చిత్తూరు మీదుగా చెన్నై తరలించే ప్రయత్నం చేశాడన్నారు. మొత్తం 40 లక్షల విలువైన గంజాయి, లారీ, సెల్ ఫోన్ ను సీజ్ చేసి నిందితుడు వరహాలును అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. వెంకటాచలం పోలీసులను అభినందించి రివార్డులు అందజేశారు.
