Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. డివైడర్ ను దాటుతుండగా కాలు జారి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు రావడంతో వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. ఈ సంఘటనపై బిజేపి భగ్గుమంది. రోడ్డు గుంతలమయంగా ఉండటంతోనే కాలు జారి పడ్డాడని నిరసన వ్యక్తం చేసింది. భారతీయ జనతా యువమోర్చా నెల్లూరుజిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిరసన తెలిపారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు గుంతల మయంగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణం అధికార యంత్రాంగం దీనిపై దృష్ఠి సారించాలన్నారు.
