Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో భూసేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలుగు గంగ, సోమశిల పరిధిలోని హై లెవెల్ కెనాల్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ మరింత వేగంగా చేపట్టి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెన్నై బెంగళూరు కారిడార్, ఆత్మకూరులోని ఎంఎస్ఎంఇ పార్క్ కు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి తొమ్మిది నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, తెలుగు గంగ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వర రావు, డిఆర్వో చిన్న ఓబులేసు, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీవోలు హుస్సేన్ సాహెబ్, మురళి కృష్ణ, చైత్ర వర్షిని, శీనా నాయక్, నేషనల్ హైవే అధారిటీ పీడీలు గోవర్ధన్, హరికృష్ణ, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
