Clock Of Nellore ( Nellore ) – నేరాలు, అసాంఘీక కార్యకలాపాల నివారణే లక్ష్యంగా నెల్లూరు పోలీసులు పనిచేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఇటీవల వరుసగా హత్యలు జరిగిన నేపద్యంలో పోలీసులు నిఘాను మరింత పెంచారు. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారు జామున నెల్లూరు భగత్ సింగ్ కాలనీ సమీపంలోని ఏపి టిడ్కో హౌసెస్ వద్ద నిర్భంధ తనిఖీలను నిర్వహించారు. నగర డిఎస్పీ సింధు ప్రియ ఆధ్వర్యంలో ముగ్గురు సిఐలు, నలుగురు ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు, 90 మంది కానిస్టేబుళ్లతో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ప్రతీ ఇంటిని తనిఖీ చేసి వారి వివరాలను సేకరించారు. స్థానికేతరులు ఉంటే వారిని ప్రశ్నించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 54 బైకులు, నాలుగు ఆటోలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేలి ముద్రల సేకరణ ద్వారా నలుగురు పాత నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నగర డిఎస్పీ సింధు ప్రియ మాట్లాడుతూ పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, బంగారం, వెండి లాంటి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం, నేరాలను నియంత్రించేందుకే ఈ నిర్భంధ తనిఖీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.