Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో సాగు నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా నీటిపారుదల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ దేశా నాయక్, సోమశిల ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట రమణారెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ లు మాట్లాడుతూ జిల్లాలో 490 నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులకు, 8 డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులకు, 7 ప్రాజెక్టు కమిటీ చైర్మన్ లకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు నవంబర్ 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందనీ. సాగునీటి సంఘాల అధ్యక్షుల ఎన్నిక నవంబర్ 21 నుండి 23 వరకు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. జిల్లాలో 490 సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి 980 మంది పోలింగ్ అధికారులను, 7వేల 396 మంది పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాస్థాయిలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు 37 మంది మాస్టర్ ట్రైనర్లుకు శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజ, నెల్లూరు రెవిన్యూ డివిజన్ అధికారి అనూష, కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి వంశీకృష్ణ, నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
