Clock Of Nellore ( Amaravati ) – ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఉండవల్లిలోని తన నివాసం నుండి చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంకు బయలుదేరగా అమరావతిలో రాజధాని రైతులు అడుగడుగునా స్వాగతం పలికారు. రోడ్డుపై పూలు చరిచి స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. గజమాలతో సత్కరించారు. అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంకు చేరుకున్న చంద్రబాబు మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ కు వెళ్లి శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటంకు పూజలు నిర్వహించారు. సరిగ్గా సాయంత్రం 4 గంటల 41 నిముషాలకు సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ తదుపరి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఐదు దస్త్రాలపై సంతకాలు చేశారు. తొలి సంతకం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పై చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. తర్వాత ముడో సంతకం పెన్షన్ 4వేల పెంపు దస్త్రంపై చేశారు. నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై చేశారు. ఇక ఐదవ సంతకం నైపుణ్య గణన దస్త్రంపై చేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు, పలువురు ఐఏఎస్ లు, ఐపిఎస్ అధికారులు చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
