Clock Of Nellore ( Tirumala ) – టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా భూమన కరుణాకర్రెడ్డి గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చిన భూమనకు మహాద్వారం వద్ద ఈవో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం భూమన కరుణాకర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత శ్రీ వకుళామాత, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, శ్రీభాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. అంతకు ముందు ఆయన తిరుపతిలోని శ్రీతాళ్లపాక గంగమ్మను దర్శించుకున్నారు. అలిపిరి లోని సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించి గో పూజలో పాల్గొని పాదాల మండపంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవరాహ స్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సామాన్య భక్తులకే నా ప్రాధాన్యం !
సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని, ధనవంతుల సేవలో తరించేవాడిని కాదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. ధనవంతులు, విఐపిలు దర్శనాల గురించి తాపత్రయపడితే స్వామివారి ఆశీస్సులు లభించవనే వాస్తవం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం ఆయన అన్నమయ్య భవనంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా తనకు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2006 నుండి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు.
ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు, కార్యనిర్వహణాధికారులు, కార్యనిర్వాహక అధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి, విశ్వాసంతో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడిందన్నారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందన్నారు. గతంలో తాను ఛైర్మన్గా పనిచేసిన హయాంలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఆచరణలో చేసి చూపామన్నారు. స్వామివారి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని చెప్పారు. హోదా, అధికారం, తాము ముఖ్యలమనే భావనతో దేవుడి దగ్గరికి వచ్చేవారిని ఆయన క్షణకాలమైనా చూడకపోతే ఉపయోగం లేదన్నారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను స్వామివారి సేవకులకు సేవకునిగా పనిచేస్తానని, అధికారం కోసం కాదని అన్నారు. స్వామివారిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామన్నారు.
