Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ వావిలేటిపాడు పరిధిలోని ముస్లింపాళెం ప్రాంతంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ పోట్లూరి స్రవంతి తెలిపారు. స్థానిక డివిజన్ లోని ముస్లింపాళెం ప్రాంతంలో స్థానికులతో కలిసి మేయర్ బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానికులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ స్థానికంగా విద్యుత్ స్థంబాలు శిధిలావస్థకు చేరుకొని ఏ క్షణమైనా పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించి కొత్త స్థంబాలను ఏర్పాటు చేయాల్సిందిగా మేయర్ అధికారులను ఆదేశించారు. డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో విద్యుత్ దీపాలు వెలిగేలా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట కొత్త విద్యుత్ దీపాలను అమర్చాలని అధికారులకు సూచించారు. అదే విధంగా వర్షాకాలం నేపథ్యంలో డివిజన్ లోని అన్నీ ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు. డ్రైనేజీ కాలువలలో పూడిక తీత, సిల్ట్ తొలగింపు పనులను ప్రణాళికా బద్దంగా నిర్వహించి దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
