Clock Of Nellore ( Nellore & Venkata Chalam ) – నెల్లూరు నగరంతో పాటూ వెంకటాచలం మండల పరిధిలో ఇద్దరు అనుమానస్పదంగా మృత్యువాత పడగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను బట్టి చూస్తుంటే ఇద్దరు నాలుగు రోజుల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని సర్వేపల్లి కాలువలో ఓ వ్యక్తి మృతదేహం చెత్తకింద ఇరుక్కుపోయి ఉండగా స్థానికులు గుర్తించి బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు రెండు క్రితం చనిపోయి ఉంటాడని అంచనా వేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా ?, ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా ? లేదంటే ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎడమ చేతిపై సుమిత్రా, కుడి చేతిపై సుభాషిణి అని పచ్చబొట్లు ఉన్నాయి. బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు జిజిహెచ్ కు తరలించారు.
మరో వైపు వెంకటాచలం మండలం, కనుపూరు అటవీ ప్రాంతంలో కూడా గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పదంగా చనిపోయి ఉండగా పోలీసులు గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో సుమారు అతను చనిపోయి వారం రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతుని వయస్సు 30 నుండి 35 ఏళ్ల వరకు ఉండవచ్చునని వెంకటాచలం పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదంటే ఎవరైనా హత్య చేశారా అనే విషయం పోస్టుమార్టంలో తేలుతుందని పోలీసులు వెల్లడించారు.
