Clock Of Nellore ( Delhi ) – దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులందరికీ మొబైల్ నెట్ వర్క్ కవరేజీ అందుతుందా లేదా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ ఒక వేళ కొన్ని చోట్ల మొబైల్ నెట్ వర్క్ అందుబాటులో లేకుంటే తీసుకున్న చర్యలు ఏమిటని కూడా ప్రశ్నించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి దేవ్ సిన్ చౌహన్ రాత పూర్వకంగా సమాధానం ఇస్తూ 2022 మార్చి నాటికి 1,20,613 గిరిజన గ్రామాలు ఉండగా, అందులో 1,00,030 గ్రామాలకు మాత్రమే మొబైల్ నెట్ వర్క్ కవరేజ్ ఉందని తెలిపారు. ఇంకా 20, 583 గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ వాణిజ్య పరంగా లాభదాయకం కాని, తక్కువ జనాభా ఉన్న కఠినమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రభుత్వం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దశలవారీగా కనెక్టివిటీని అందిస్తారని తెలిపారు. ఇందుకుగాను ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.