Clock Of Nellore ( Indukuru peta ) – నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు ముఖ్యమైన కోరికలను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకూరుపేట మండలంలోని సోమరాజుపల్లి, యుబి కండ్రిగలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ముదివర్తి – ముదివర్తి పాలెం మధ్య సబ్మిర్జిబుల్ కాజ్వే నిర్మాణానికి తాను, స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గురువారం కృష్ణ పట్నంకు విచ్చేసిన సీఎం జగన్ దానికి 93 కోట్లు కేటాయించడమే కాకుండా, శంకుస్థాపన కూడా చేయడం ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. దీనివల్ల రెండు మూడు మండలాల్లో ఉప్పు నీటి బెడద తీరడమే కాకుండా, రాకపోకలకు సౌకర్యం కూడా కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

తెలుగు గంగ సాధనకు, కండలేరు నిర్మాణానికి కారకుడైన మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరును నెల్లూరు బ్యారేజ్ కు పెట్టాలని సీఎం ప్రకటించడం మరింత ఆనందం కలిగించే విషయమని తెలిపారు. గడప గడపకు కార్యక్రమంలో వేలాది ఇళ్లు తిరుగుతున్న ప్రసన్న కుమార్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎంపీ ఆదాల పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక వైసీపీ నేత దేవి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి, డిసిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వీరి చలపతి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నవీన్ కుమార్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.