ఏపిలో మరో రెండు రోజులు వర్షాలు

Clock Of Nellore ( Amaravathi ) – అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లోని కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పలుచోట్ల బుధవారం వర్షాలు కురిశాయి. ఈనెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు మధ్య మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ ప్రభావంతో అక్టోబర్ 5వ తేదీ ( బుధవారం ) కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 6వ తేదీ ( గురువారం ) కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 9వ తేదీన ఏర్పడే అల్పపీడనం శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

అల్పపీడన ప్రభావం నాలుగు రోజులు ఉంటుందని.. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పండగల సందర్భంగా యువత, మహిళలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పలు చోట్ల బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని హెచ్చరించారు.

అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ వాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా క్షేత్రస్థాయి అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరం అయితే పునరావస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Previous

భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త…

Read Next

105 రోజుల షెడ్యూల్ : గడప గడపకు తిరిగి ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.