Clock Of Nellore ( Nellore ) – మత సామరస్యానికి అసలైన కేరాఫ్ అడ్రస్ నెల్లూరు అని రాష్ట్ర మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి కొనియాడారు. మత సామరస్యానికి చిరునామాగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ బారా షాహిద్ దర్గాను ఆమె తన కుమారుడు ఆర్యన్తో కలిసి సందర్శించారు. దర్గాకు విచ్చేసిన షరణికి మరియు ఆర్యన్కు ఆలయ కమిటీ సభ్యులు అత్యంత ఘనంగా, సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో కుమారుడు ఆర్యన్తో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చదర్ సమర్పించారు. ఈ సందర్భంగా షరణి మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే పవిత్ర వేదిక ఈ బారా షాహిద్ దర్గా అని, 12 మంది వీర జవాన్ల త్యాగ ఫలితమే ఈ క్షేత్ర పవిత్రత అని పేర్కొన్నారు. ఆ మహనీయుల ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. నెల్లూరును పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తూ, జిల్లా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
