Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ 2వ డివిజన్ పెద్దచెరుకూరు జనసంద్రాన్ని తలపించింది. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో వీధులు కిక్కరిసిపోయి పసుపుమయం అయ్యాయి. మూడు పార్టీల జెండాల రెపరెపలతో స్థానికంగా ఉత్సాహం ఉరకలెత్తింది. బుధవారం సాయంత్రం వేలాదిమంది ప్రజల మధ్య నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పెద్ద చెరుకూరులో ప్రచారం నిర్వహించారు. నేతలకు నాయకులకు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రచారరథంపై ఎక్కిన నేతలు…. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు.
ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వచ్చి జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నెల్లూరును ఇండిస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయని, తనపై పోటీ చేసే విజయసాయి రెడ్డి విశాఖలో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. విశాఖను లూటీ చేశారని, ఇప్పుడు నెల్లూరు మీద పడ్డారని ఆరోపించారు. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 365 రోజులు ప్రజల మధ్య ఉండే వ్యక్తి అని, ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం ప్రజల అదృష్టమన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని ముచ్చటగా మూడవసారి గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందన్నారు. మే 13 తరువాత విజయసాయి రెడ్డి, ఆదాలప్రభాకర్ రెడ్డి నెల్లూరు లో ఉండరని, ఎక్కడ వుంటారో వెత్తుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా శ్రీధర్రెడ్డిని, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎక్కడ చూసినా ధరల పెరుగుదలతో కుటుంబాలు ఆర్థిక భారంతో సతమతమవుతున్నాయని చెప్పారు. ఎక్కడ చూసినా కల్తీ మద్యంతో ప్రజలు ఆసుపత్రులపాలవుతున్నారని విమర్శించారు. ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఆర్థిక భారం తగ్గాలన్నా, సుపరిపాలన అందాలన్నా నారా చంద్రబాబు నాయుడును సీఎం చేసుకోవాలని కోరారు. మంచి మనిషి, ప్రజాసేవకుడు వేమిరెడ్డిని ఎంపీగా, రూరల్ ఎమ్మెల్యేగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సూచించారు.
