Clock Of Nellore ( Nellore ) – ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు సిటీలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రతి కార్యకర్త సంక్షేమమే తన ధ్యేయమంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీపై నమ్మకం, నారాయణ అంటే భరోసాతో సిటీ నియోజకవర్గ పరిధిలోని పలువురు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శనివారం నెల్లూరులోని గోమతినగర్ క్యాంప్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్ల నుంచి వందలాదిగా విచ్చేసిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూప్ కుమార్ యాదవ్, తాళ్ళపాక అనురాధతో కలిసి నారాయణ అందరినీ అప్యాయంగా పలకరించి… ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కాగా ఇదిలా ఉంటే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి వలసల భయం వెంటాడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతవరకు వైసీపీలో కొనసాగిన వారందరూ ఒక్కొక్కరుగా టీడీపీ గూటికి చేరుతున్నారు. నిన్నా మెన్నటి వరకూ వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడగా, తాజాగా వైసీపీ అగ్ర నేతలకు కుడి భుజంగా ఉన్న నేతలు సైతం ఆ పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో రోజురోజుకు నెల్లూరు సిటీలో వలసల జోరు కనిపిస్తుంది. ఇక సిటీలో వార్ వన్ సైడేనని అటు నేతలతో పాటు కార్యకర్తలు, ప్రజలు డిసైడ్ అయిపోయారని విస్తృతంగా చర్చ కొనసాగుతుంది.
నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజాసంక్షేమమే ధ్యేయం…
తెలుగుదేశంపార్టీలోకి జోరందుకున్న వలసల నేపథ్యంలో డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి టీడీపీతోనే మంచి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే రోజురోజుకు టీడీపీలోకి కొనసాగుతున్న వలసలేనని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే… అది విజనరీ ఉన్న నేత చంద్రబాబు వల్ల సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే గాక చెత్తపన్ను వేసి ఆయా ప్రాంతాలను మురికి కూపాలుగా మార్చిన ఘనత జగన్కే దక్కిందని ఎద్దేవాచేశారు. చెత్తపన్ను వేసిన ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణల్లో చెత్తను ఎత్తివేయక పోవడంతో ప్రజలు రోగాల బారినపడ్డారని ధ్వజమెత్తారు. ఈ చెత్త ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు వైసీపీని అధికారం నుంచి తొలగిస్తారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువగళం పథకం ద్వారా 20లక్షల నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారాయణ మాటిచ్చారు. నిరుద్యోగులకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు ఇవ్వను న్నట్లు తెలిపారు.