Clock Of Nellore ( Nellore ) – మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా అద్భుతమైన అమరావతి రాజధాని కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఉందని నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటున్న తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఆయన దొంతాలి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆ గ్రామానికి చేరుకున్న కోటంరెడ్డికి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కోటంరెడ్డి మాట్లాడారు. వైసీపి అభ్యర్ధులు చెప్పే అబద్దాలు చెప్పి మోసపోవద్దని, వారి చెప్పే మాటలు విని వైసీపికి ఓటు వేస్తే రాష్ట్రం రాక్షస రాజ్యంగా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్ పథకం ద్వారా మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నారని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన నెల నుండే నెలకు 4వేల చొప్పున పెన్షన్ ను ఇవ్వనున్నారని, ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో మొత్తం 7వేలు పెన్షన్ ఇస్తామన్నారు. వచ్చే నెల 13వ తేదీ జరిగే పోలింగ్ లో ప్రతీ ఒక్కరూ సైకిల్ గుర్తు కు ఓటు వేసి టిడిపిని గెలిపించాలని కోటంరెడ్డి కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
