Clock Of Nellore ( Kaligiri ) – ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని నెల్లూరు పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తో కలిసి కలిగిరి మండల కేంద్రంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ముందుగా కలిగిరి చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం కాకర్ల సురేష్ తో కలిసి కలిగిరి పట్టణంలోని శ్రీ కలుగోలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రతి దుకాణంలోకి వెళ్ళి వారితో ముచ్చటిస్తూ కరపత్రాలు అందిస్తూ ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారుల నుంచి ప్రజల దాకా ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. అనేకమంది తమ సమస్యలను, వైసిపి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులను నేతల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, తాము గెలిచిన వెంటనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. కలిగిరి ప్రాంతంలో ప్రజలు సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గెలిచిన వెంటనే తప్పకుండా నీటి వసతి ఏర్పాటు చేస్తామన్నారు. వేమిరెడ్డి మాట ఇస్తే మర్చిపోవడం జరగదని, ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో టిడిపి, బిజేపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
