Clock Of Nellore ( Delhi ) – దేశంలో లోక్ సభ ఎన్నికలతో సహా మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ తో సహా ఒరిస్సా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ శనివారం సాయంత్రం షెడ్యూల్ ను విడుదల చేశారు. నేటి నుండే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంభందించి 4వ విడతలలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటూ లోక్ సభ ఎన్నికలు కూడా ఒకే దఫాలో నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకూ అభ్యర్ధుల నుండి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్ 26వ తేదీనా నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. తర్వాత అసెంబ్లీ, లోక్ సభ స్థానాాలకు మే నెల 13వ తేదీనా పోలింగ్ ప్రక్రియను చేపడతామన్నారు. పోలింగ్ అనంతరం జూన్ 4వ తేదీనా ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు.
