Clock Of Nellore ( Nellore ) – అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్ధి ఎంపిక విషయం రోజు రోజుకూ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. మొదటగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేయగా ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. నెల్లూరు సిటీ సీటు విషయంలో తలెత్తిన అంతర్గత విభేధాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ నుండి తప్పుకుని, వైసీపికి దూరంగా ఉన్నారు. రెపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరుతారని తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపికి దూరం అవడంతో ఆగమేఘాలపై సిట్టింగ్ ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లికి పిలుపించుకుని మాట్లాడారు. నెల్లూరు రూరల్ నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని ఆనం విజయకుమార్ రెడ్డికి కూడా జగన్ సూచిస్తూ… ఎంపిగా మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదాల ప్రభాకర్ రెడ్డికి జగన్ సూచించి పంపారు. తర్వాత ఏమైందో ఏమో గానీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నుండే పోటీ చేయాలని సూచించారు. నెల్లూరు ఎంపిగా ఆనం విజయకుమార్ రెడ్డిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేశారు. ఈ నేపద్యంలో ఎంపి విజయసాయి రెడ్డిని రంగంలోకి దింపారు. మీరే నెల్లూరు ఎంపిగా పోటీ చేయాలని కోరగా… ఆయన ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి, తనకు బంధువైన నెల్లూరు వాసి, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ పెనాక శరశ్చంద్రారెడ్డి పేరును ప్రతిపాదించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శరశ్చంద్రారెడ్డి ముద్దాయిగా ఉన్నారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆర్ధికంగా ఎన్నికల ఖర్చును భరాయించగలడన్న ఉద్దేశ్యంతో శరశ్చంద్రారెడ్డి పేరును నెల్లూరు ఎంపిగా ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చివరి వరకూ ఉంటుందా మధ్యలో మారుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతానికైతే శరశ్చంద్రారెడ్డి పేరే ప్రతిపాదనలో ఉంది.