Clock Of Nellore ( Rajamahendra Varam ) – రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇవాల్టి ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైందని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. వైసీపిని సమిష్ఠిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందన్న పవన్… బిజేపి కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. బాలకృష్ణ, లోకేత్ తో కలిసి రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో చంద్రబాబులో పవన్ ములాఖత్ అయ్యారు. అనంతరం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకొచ్చిన ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు రాజకీయవేత్త… జగన్ ఆర్ధిక నేరస్తుడు అన్న పవన్ కళ్యాణ్… సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే తన ఆకాంక్ష అని తెలిపారు. హైటెక్ సిటీ సృష్ఠించిన విజనరీకి ఈ దుస్థితి ఏమిటి… ? ఏపి దుస్థితిపై ప్రధాని మోడీ, అమిత్ షా, గవర్నర్ కు తెలియజేస్తానని చెప్పారు. చంద్రబాబు భద్రత విషయం ప్రధానికి, అమిత్ షా దృష్ఠికి తీసుకెళ్తానని పవన్ వెల్లడించారు. వైసీపి నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఒకే కారులో పవన్, భాలకృష్ణ, లోకేష్ లు చంద్రబాబు సతీమణి ఉంటున్న ఇంటికి వెళ్లారు. అక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణితో మాట్లాడారు.
