Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పొదలకూరు రోడ్డు 33/1 నేతాజీనగర్ సచివాలయాన్ని నగర మేయర్ స్రవంతి మంగళవారం తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సచివాలయంలోని ఇన్ స్పెక్షన్ రిజిస్టర్, హాజరు రిజిస్టరు, స్పందన రిజిస్టర్లతో పాటు నోటీసు బోర్డులోని ప్రభుత్వ పథకాల ప్రచార పత్రాలను స్థానిక కార్పొరేటర్ కరణం మంజులతో కలిసి పరిశీలించారు. వివిధ సంక్షేమ పథకాల అమలు రికార్డులను సచివాలయంలో డిపార్టుమెంటుల వారీగా వారు తనిఖీ చేశారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి స్పందన ఆర్జీలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సచివాలయ కార్యదర్శులను మేయర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని గృహాలలో విచారించి నూతనంగా అర్హులైన వారికి పెన్షన్లను, కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న వివిధ రకాల సేవలను గడువు లోపల పూర్తి చేయాలని తెలిపారు. స్పందన వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని సచివాలయ కార్యదర్శులను మేయర్ ఆదేశించారు. ప్రజలకు అందించే సేవలలో సచివాలయ కార్యదర్సులంతా నిబద్ధత పాటించాలని, సంక్షేమ పథకాల అమలు లక్ష్యాలను అందుకోవాలని మేయర్ సూచించారు. పరిష్కరించలేని ఫిర్యాదులను నగరపాలక సంస్థలోని తమ కార్యాలయం దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ తెలియజేశారు. సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే వాటిని తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
