Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశంలో తనపై దాడి చేసి అవమానించిన కార్పొరేటర్లు మొయిళ్ల గౌరి, మూలే విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస యాదవ్ లను వెంటనే అరెస్ట్ చేయాలని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె సహచర కార్పొరేటర్లు, గిరిజన సంఘాల నేతలతో కలిసి జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిశారు. సోమవారం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో ఆ ముగ్గురు తనను లక్ష్యంగా చేసుకుని, గిరిజన మహిళ అన్న చిన్నచూపుతో తీవ్రంగా అవమానించడమే కాకుండా ఛాంబర్ కు వెళుతున్న తనపై దాడి చేశారని మేయర్ ఎస్పీకి వివరించారు. దీనిపై సోమవారం సాయంత్రమే దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశామని ఇంత వరకూ స్పందన లేదన్నారు. తక్షణం ముగ్గుర్ని అరెస్ట్ చేయాలని కోరారు. అలాగే దాడి చేయడమే కాకుండా తమ కార్పొరేటర్ల భర్తలపై రివర్స్ కేసులు పెట్టారని, దర్గామిట్ట పోలీసులు వారి ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేయడం దురదృష్ఠకరమన్నారు. తక్షణం వారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని మేయర్ స్రవంతి… ఎస్పీని కోరారు.
ఎస్పీని కలిసిన అనంతరం మేయర్ స్రవంతి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో అంశాన్ని సాకుగా చూపి తనపై కుట్రతో ఆ ముగ్గురు కార్పొరేటర్లు తనను అవమానించారని చెప్పారు. తాను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ఉన్నప్పటి నుండి కొందరు కార్పొరేటర్లు తనను లక్ష్యంగా చేసుకున్నారని, కేవలం గిరిజన మహిళ అనే చిన్నచూపుతో తనను అవమానించడమే కాకుండా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ దృష్ఠి తీసుకెళతానని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రధమ పౌరురాలిగా గిరిజన మహిళ ఉండటాన్ని ఓర్వలేని ఆ ముగ్గురు కార్పొరేటర్లు దాడికి పాల్పడటం దురదృష్ఠకరమని తక్షణం వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము కూడా గిరిజనరాలేనని పెంచలయ్య గుర్తు చేశారు. 24 గంటల్లోగా ఆ ముగ్గురు కార్పొరేటర్లను అరెస్ట్ చేయకపోతే బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అన్నీ గిరిజన సంఘాలు ఆందోళన చేస్తాయని హెచ్చరించారు.
