Clock Of Nellore ( Amaravathi ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న అభియోగంతో ఆ నలుగుర్ని సస్పెండ్ చేసినట్లు ఆయన ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, నెల్లూరు రూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. మరో వైపు సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. వెంటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి ప్రభుత్వ తీరును పలు సందర్భాల్లో విమర్శించారు. అప్పటి నుండి ఆయన్ను దూరంగా పెట్టిన పార్టీ అధిష్ఠానం ఆ నియోజకవర్గానికి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని ఇంఛార్జ్ గా నియమించింది. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, అనుమానం ఉన్నచోట ఉండలేనంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు తాను పక్కకు తప్పుకున్నారు. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయడం ఊహించని పరిణామంగా చెప్పుకోవచ్చు. గత కొంత కాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న మేకపాటి ఎక్కడా బాహాటంగా విమర్శలు చేయలేదు. దీనిపై మేకపాటి స్పందిస్తూ తన బరువు దిగిపోయిందని, ఆ పార్టీకో నమస్కారమని అన్నారు. పార్టీ తనను తీవ్రంగా అవమానించదని అన్నారు.