Clock Of Nellore ( Saidapuram & Kovur ) – అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు మృగాళ్లు. మంగళవారం ఒక్క రోజే నెల్లూరుజిల్లాలో రెండు సంఘటన వెలుగు చూశాయి. ఓ యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేయగా మరో సంఘటనలో మైనర్ బాలికను ఇంకో వ్యక్తి గత నెల నుండి అత్యాచారం చేస్తున్న విషాదకర సంఘటన బయటకొచ్చింది. రెండు ఘటనలకు సంభందించి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలం, మలిచేడు గ్రామంలో 15 ఏళ్ల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీనిపై తల్లిదండ్రులు సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో వైపు కోవూరు మండలం, గుమ్మళ్లదిబ్బ ప్రాంతానికి చెందిన నిడిగుంట పవన్ అనే వ్యక్తి సమీపంలో ఉండే ఓ కుటుంబంతో సన్నిహితంగా ఉండే వాడు. ఆ కుటుంబంలోని మైనర్ బాలికను తన చెల్లి అని చెప్పుకుని తిరిగేవాడు. దీంతో ఆ కుటుంబానికి పవన్ ప్రవర్తనపై అనుమానం రాలేదు. ఇదే అదునుగా భావించిన పవన్ ఆ బాలికను భయపెట్టి గత కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. పవన్ హింసను భరించలేని ఆ బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.