Clock Of Nellore ( Nellore ) – కాలికి గాయమై చికిత్స నిమిత్తం ఇంటికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 2 నెలల విరామం అనంతరం శుక్రవారం తొలిసారిగా బయటకు వచ్చారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. భార్య సంధ్యతో కలిసి ఆలయానికి విచ్చేసిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వాకర్ సాయంతోనే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టారు. లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కాంక్షించారు.

అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాను ప్రజా క్షేత్రంలోకి వస్తానని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. తన కాళ్లు బాగున్నా లేకున్నా టిడిపి గెలుపు కోసం నడుస్తూనే ఉంటానన్నారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో పయనించాలంటే చంద్రబాబు సిఎం కావాలన్నారు. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేశారు. ఆయన కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారన్నారు. తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను నేటికి లబ్ధిదారులకు అందించలేదన్నారు. ప్రజలంతా చంద్రబాబును సిఎంను చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాథస్వామి దేవస్థానం మాజీ ఛైర్మైన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
