Clock Of Nellore ( Rapur ) – నెల్లూరుజిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంతాల జలాశయాల సందర్శనలో భాగంగా మంగళవారం కండలేరు జలాశయాన్నీ కృష్ణ రివర్ బోర్డు డెవలప్ మెంట్ ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివ శంకరయ్య సందర్శించారు. కండలేరుకు చేరుకున్న ఆయనకి కండలేరు, సోమశిల ఎస్ఈ లు హరి నారాయణరెడ్డి, రమణా రెడ్డి లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వ తదితర అంశాలపై చర్చించారు. కండలేరు జలాశయానికి సంబంధించి చిత్రపటాన్ని ఎస్ఈ హరి నారాయణ రెడ్డి వారికి చూపి దాని గురించి వివరించారు.పెన్నా పరివాహక జలాశయం నుంచి చెన్నై కి విడుదల చేసే నీటి వివరాలు, ప్రస్తుతం సోమశిల, కండలేరు జలాశయాల్లో నిల్వలు గురించి చర్చించారు. అనంతరం సత్య సాయి గంగ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగు గంగ ఎస్ఈ హరి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది కండలేరు నుంచి చెన్నై కి 12 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ఈ ఏడాది 4.8 టీఎంసీ నీరు చెన్నై కి విడుదల చేశామన్నారు. వర్షాల కారణంగా చెన్నైలో నీరు ఉండడం వల్ల 11.1 టీఎంసీల నీటిని నిలుపుదల చేశామన్నారు. చెన్నై ప్రాంత వాసులకు ఎప్పుడు నీరు అవసరమైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 51.88 టీఎంసీలు, సోమశిల జలాశయంలో 71.5 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కండలేరు, సోమశిల ఈఈలు విజయ్ కుమార్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, డీఈ లు ముని వేణు, సుబ్రహ్మణేశ్వర రావు, బాబయ్య, ఏఈలు తిరుమలయ్య, గోపి కృష్ణ, సాయి ప్రతాప్, చిట్టి బాబు , ప్రసన్న లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.