Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నెల్లూరులో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అంతర్జాతీయ ప్రసంగీకులు శ్యామ్యుల్ కర్మోజీ, నెల్లూరు బిషప్ ప్రకాశం, సినీ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, సినీ నృత్య దర్శకులు జానీ తదితరులు హాజరయ్యారు. ముందుగా భక్తులు క్రైస్తవ గీతాలను ఆలపించారు. తరువాత భరత నాట్యం ద్వారా క్రైస్తవ గీతాలకు నృత్యం చేయించారు. అనంతరం బిషప్ ప్రకాశం క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది క్రైస్తవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం తన అదృష్ఠంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తదుపరి సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ క్రీస్తు గీతాన్ని ఆలపించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చివరగా కొరియా వారిచే క్రీస్తు నాటకాన్ని ప్రదర్శించారు. రాత్రి 10 గంటలకు పైగా ఈ కార్యక్రమం కొనసాగింది.
