Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో వైసీపి ఎప్పుడూ లేని విష సంస్క్రృతిని అమలు చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా ఆయన నెల్లూరు సిటీలోని సంతపేట సుందరగిరి వారి వీధిలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

అనంతరం వినోద్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలకు పైగా ఏర్పాటైన సంస్థలకు నాటి పరిస్థితుల దృష్ట్యా పేర్లు పెట్టుంటారని, ఇప్పుడు వైసీపీ ఆ సంస్థలకు రాజకీయ ప్రయోజనాల కోసం పేర్లు మార్చడం చెడ్డ సంస్కృతికి నాంది పలికినట్లు అవుతుందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలనే ప్రయత్నంలో రాజకీయ ఉద్దేశాలు తప్పించి ఎటువంటి ప్రయోజనాలు లేవని అన్నారు. వైద్య రంగానికి ఎనలేని సేవలు చేసిన వారి పెట్టాలని ప్రభుత్వం భావిస్తే మహనీయులైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు వంటి వారి పెట్టాలని, ఇదే అంశాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వానికి హితవు పలికారని అన్నారు. పేర్లు మార్చుకునే సంస్కృతి మొదలైతే రేపటి రోజున ప్రభుత్వాలు మారినప్పుడు మరలా ఈ సంస్థలకు పేర్లు మారుస్తారని, దీని వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అన్నారు.
ఇప్పటికే జిల్లాల పేర్లు, ప్రాజెక్టుల పేర్లు, పథకాల పేర్ల విషయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు నియంత్రణ తప్పాయని అన్నారు. ఇటీవల నెల్లూరు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారని, అదేవిధంగా కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు ఉందని, రేపు ప్రభుత్వాలు మారినప్పుడు ఈ పేర్లను తొలగిస్తామని అంటే వైసీపీ వారు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. భావోద్వేగాలతో ముడిపడి ఉండే అంశాలను లేవనెత్తి వైసీపీ రాష్ట్రంలో విద్వేషాలకు కారణమవుతోందని, ఇది మంచి పద్ధతి కాదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హితవు పలికారు.
