Clock Of Nellore ( Amaravathi ) – సాంకేతిక కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవల 108 కాల్ సెంటర్ నిలిచిపోయింది. సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర సేవల ఫోన్ నెంబర్ 108 పని చేయటం లేదని ఆ సంస్థ అదనపు సీఈఓ మధుసూధన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు అంబులెన్స్ సేవల కోసం 104 నెంబర్ ను సంప్రదించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం సర్వర్లో ఏర్పడిన సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో అత్యవస వైద్య సేవలతో పాటు పోలీసు, ఫైర్, మెడికల్ ఎమర్జెన్సీల కోసం ప్రభుత్వం 108 ఫోన్ నెంబర్ను కేటాయించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఉన్న ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవల్ని 108 అందిస్తోంది. అయితే ఇవాళ ( శనివారం ) ఉదయం నుంచి ఏర్పడిన సాంకేతిక సమస్యతో 108 సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్టు ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి తిరిగి 108 సేవలను పునః ప్రారంభిస్తామని తెలిపారు. అప్పటి వరకూ అంబులెన్స్ సేవల కోసం 104కు ఫోన్ చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 108 ఫోన్ నెంబరు పని చేయనప్పటికీ 108 అంబులెన్సు సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదని ప్రభుత్వం తెలిపింది.