Clock Of Nellore ( Nellore ) – తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించినపుడే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయగలమని, నగర పాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు నగర పౌరులంతా విడివిడిగా చెత్తను అందించి సహకరించాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి ( IAS Jahnavi ) కోరారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 1 వ డివిజను నారాయణరెడ్డి పేట, అంబేద్కర్ నగర్, శోభన్ నగర్ తదితర ప్రాంతాలను కమిషనర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేరుగా ఇంటి నుంచే వ్యర్ధాలను సేకరించినపుడు వీధుల్లోని పెద్ద డస్ట్ బిన్ ల అవసరం ఉండదని తెలిపారు. డస్ట్ బిన్ ల వలన పందులు, పశువులు, కుక్కలు వంటి జంతువులకు ఆవాసం ఉండక జనావాసాల్లో వాటి సంచారంపై నియంత్రణ ఉంటుందని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా నిర్వహించేలా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హానికరమైన దోమల సంతాన ఉత్పత్తిని అడ్డుకునేలా డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పూడికతీత పనులను నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 1 వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సచివాలయం కార్యదర్శులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
