Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. సుమారు సంవత్సరం రోజుల పాటూ సాగే ఈ పాదయాత్రలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ప్రతీ గడపకూ వెళ్లనున్నారు. జనసేన పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. పవనన్న ప్రజాబాట పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం 3వ డివిజన్ పరిధిలోని వేణుగోపాలనగర్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు కేతంరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేతంరెడ్డిని గజమాలతో సత్కరించారు. తొలి రోజు వేణుగోపాల నగర్ లోని ప్రతీ ఇంటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం కేతంరెడ్డి వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంతో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని, ఒక్క ఛాన్స్ తో గత ఎన్నికల్లో జగన్ కు ఓటేసిన వారంతా ఈ సారి జగన్ కు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని ఈ విషయం ప్రతీ ఒక్కరూ చెబుతున్నారని అన్నారు. మూడేళ్లు మంత్రిగా ఉన్న అనీల్ కుమార్ యాదవ్ నగరానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ తమకు పోటీయే కాదని మాట్లాడిన సిఎం జగన్, నేడు మాత్రం పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు ఉయ్యాల ప్రవీణ్, నలిశెట్టి శ్రీధర్, పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, ఏటూరి రవి, కాకు మురళీ రెడ్డి, ఉడాలి సూర్యనారాయణ స్వామి, చింతంరెడ్డి శిరీషా రెడ్డి, షేక్ ఆలియా, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.