Clock Of Nellore ( Manubolu ) – గతంలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా,పెట్టుబడి నిధిగా 13 వేల రూపాయలు ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మనుబోలు మండల కేంద్రంలో సోమవారం రాత్రి పర్యటించారు. తొలుత పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలా ఫలకాలను మండల కార్యాలయ ఆవరణంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత అశేష జనవాహిని వెంటరాగా పాదయాత్రగా సభాస్థలికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ 35 మాసాలుగా సర్వేపల్లి శాసన సభ్యుడిగా ఉండి, మంత్రివర్గంలో స్థానం సంపాదించటానికి కారణమైన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను ఆజన్మాంతం గుర్తుంచుకుంటానన్నారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, దాదాపు లక్షా 40వేల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలుసుకొని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు సిద్ధమవుతున్నాయన్నారు. ఎరువుల సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను త్వరలో తొలగిస్తామన్నారు. డ్రోన్ల తో ఆధునిక సాగు పద్ధతులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, అవి సత్ఫలితాలనిస్తే, రాష్ట్రంలోని అన్ని సచివాలయాల పరిధిలో డ్రోన్లను అందుబాటులో ఉంచుతామన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్డు కనిపించకుండా చేయడమే తన ధ్యేయమన్నారు. మనుబోలు మండలం లో 13 కోట్ల రూపాయల వ్యయం తో వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్తాపన చేశామన్నారు. చివరగా ఉత్తమ అవార్డులు సాధించిన వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం అభిమానులు గజమాలతో మంత్రిని సత్కరించారు.
