నెల్లూరుజిల్లాలో రబీ పంటకు 46 TMC ల సాగునీరు కేటాయింపు – మంత్రి కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలోని సాగు, త్రాగునీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని ప్రణాళికాబద్దంగా రబీ 2వ పంట సాగుకు సంబందించి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల కింద ఆయకట్టుకు సంబందించి 2వ పంటకు సాగునీరు అందించేందుకు ఈ రోజు జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో 4,26,565 ఎకరాలకు సంబందించి 46 టి.ఎం.సి.ల నీటిని కేటాయిస్తూ కమిటి తీర్మానించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు, నీటి సంఘాల సభ్యులు సూచనలు, సలహాల ఇవ్వడం జరిగిందని, వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని రైతాంగానికి అవససరమైన సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

క్షేత్రస్థాయిలో పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను, సాగునీటి పారుదల కాలువలకు చేపట్టాల్సిన మరమ్మత్తులు, పూడిక తీత పనులు, చుక్కల భూముల సమస్య వలన రైతులు పడుతున్న ఇబ్బందులు తదితర అంశాలను ఎమ్మెల్యేలు, కమిటీ దృష్టికి తీసుకురాగ మంత్రి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ, ధాన్యం కొనుగోలు విషయంలో నియమ నిబందనలు పాటించకపోతే సంబందిత అధికారులు, మిల్లర్ల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు సంబందించి అదనపు లక్ష్యాలను నిర్ధేశించి మిగిలిపోయిన ధాన్యాన్ని కొనుగోలుచేసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి వివరించారు. చుక్కల భూముల సమస్య పై మంత్రి స్పందిస్తూ చుక్కల భూముల సమస్యలపై అధికారులతో చర్చిండం జరిగిందని, షెడ్యూలును రూపొందించుకొని, ఏ ప్రాంతంలో ఆయితే చుక్కల భూముల సమస్యలు ఎక్కువగా వుంటాయో ఆ ప్రాంతానికి అధికారులు వెళ్ళి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

జిల్లాలో ప్రతిపాదించిన సాగునీటి కెనాల్స్ మరమ్మతులు, పూడికతీత పనులు త్వరగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. క్రాప్ డైవర్షన్ గురించి చర్చించడం జరుగుచున్నదని, వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వై.ఎస్.ఆర్ యంత్ర సేవ పధకం ద్వారా సబ్సిడీ కింద 3500 ట్రాక్టర్స్ ను రైతులకు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్దం చేస్తున్నారని, జిల్లాలో అర్హులైన రైతులు ధరకాస్తు చేసుకోవాలని మంత్రి ఈ సంధర్భంగా సూచించారు.

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, గడిచిన రెండు సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా జిల్లా సాగు నీటి సలహా బోర్డు సమావేశం జరగలేదన్నారు. మొదటినుండి జిల్లాలో వరి సాగుకు ప్రత్యేక స్థానం, గుర్తింపు వుందన్నారు. 150 టి.ఎం.సి.ల గరిష్ట సామర్ధ్యం కలిగి సోమశిల, కండలేరు జలాశయాలు జిల్లాలో వున్నాయని, జిల్లాలో 2వ పంటకు సాగునీటిని కేటాయించేందుకు సోమశిల జలాశయం కింద మొత్తం 2.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు 28.400 టి.ఎం.సి.ల సాగునీటి కేటాయింపుకు, అలాగే కండలేరు జలాశయం కింద నెల్లూరు, తిరుపతి జిల్లాలో గల 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించుటకు 6 టి.ఎం.సి ల నీటిని కేటాయించేలా ఈ సమావేశంలో ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గ్రామ స్థాయిలో నీటి సంఘాల సభ్యులను, నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసి కేటాయించిన సాగునీటిని ప్రతి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి గ్రామలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆ గ్రామంలోనే సరఫరా చేయడంతోపాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ సలహా సంఘం సమావేశాలు నిర్వహించి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో జిల్లాలో వరదలు, తుఫాన్లు వలన రైతులు నష్టపోవడం జరిగిందని, ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు నష్టపోతే అదే సీజన్ల్లో నష్ట పరిహారం చెల్లించడంతో పాటు రైతులకు అవసర మైన విత్తనాలు సబ్సిడీ పై అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం, బల్లి కల్యాణ్ చక్రవర్తి, వెంకటగిరి, కావలి, నెల్లూరు గ్రామీణ, గూడూరు, కందుకూరు శాసన సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వరప్రసాద్, మానుగుంట మహిధర్ రెడ్డి పాల్గొని, ఆయా నియోజ వర్గాల్లో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలులో పడుతున్న ఇబ్బందులు, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, సాగునీటి కెనాల్స్ కు చేపట్టాల్సిన మరమ్మత్తులు, పూడికతీత పనులు తదితర అంశాలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ కృష్ణమోహన్, తెలుగు గంగ ప్రాజెక్ట్ సి.ఈ హరి నారాయణ రెడ్డి, నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఆర్.డి.ఓ లు కొండయ్య, కిరణ్ కుమార్, శీనా నాయక్, వ్యవసాయ శాఖ జె.డి సుధాకర్ రాజు, జిల్లాలోని నీటి యాజ్యమాన్య సంఘాల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

వాలంటీర్లకు పురస్కారాలు… అందజేసిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Read Next

ముఖ్యమంత్రికే తప్పుడు సమాచారం ఇస్తారా ? – అధికారులపై ఆనం అసహనం

Leave a Reply

Your email address will not be published.