Clock Of Nellore ( Nellore ) – సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలను ప్రతి ఒక్క వాలంటీర్ సాధించుకునేలా కృషి చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. స్థానిక 38వ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు కస్తూరి దేవి స్కూలు ప్రాంగణం లోని రవీంద్రనాథ్ ఠాగూర్ మందిరంలో ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి ( Nellore Mayor Sravanthi ) ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు వాలంటీర్ల ఉగాది పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన దేశంలో, ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగం చేసారని తెలిపారు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో సైతం ప్రజలకు కావలసిన సేవలు, ప్రజలకు అందాల్సిన పథకాలను ప్రభుత్వం నుంచి చేరవేసే రథసారథులుగా వాలంటీర్లు నిలిచారని కొనియాడారు. వాలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది పుర్కారాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని వారు ప్రశంసించారు. అవార్డులు అందుకోని వారికి, అందుకున్న వారికి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు అందుకోని వారు నిరుత్సాహపడకుండా మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో గౌరవాన్ని అందుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, APCOS చైర్మన్ షైక్ సైదాని, మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, 38వ డివిజన్ ఇంచార్జ్ దాసరి రాజేష్ మరియు ఇతర వై.సీ.పీ నాయకులు పాల్గొన్నారు.
