పథకాల అమల్లో వాలంటీర్లదే కీలక పాత్ర – అవార్డులు అందజేసిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలను ప్రతి ఒక్క వాలంటీర్ సాధించుకునేలా కృషి చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. స్థానిక 41వ డివిజన్, ఇరుకళల పరమేశ్వరి గుడి ఎదురుగా, రాజీవ్ గృహ కల్ప సమీపంలోని, పరమేశ్వరి నగర్ 2వ వీధి లోని 41/1 సచివాలయం నందు విధులు నిర్వహిస్తున వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, వై.సీ.పీ సీనియర్ నాయకులు మిద్దె మురళి యాదవ్ గార్లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు వాలంటీర్ల ఉగాది పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన దేశంలో, ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగం చేసారని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో సైతం ప్రజలకు కావలసిన సేవలు, ప్రజలకు అందాల్సిన పథకాలను ప్రభుత్వం నుంచి చేరవేసే రథసారథులుగా వాలంటీర్లు నిలిచారని కొనియాడారు. వాలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన ముఖ్యమంత్రి సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది పుర్కారాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని వారు ప్రశంసించారు. అవార్డులు అందుకున్న వాళ్లకి, అందుకోని వాళ్ళకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు రానివాళ్లు మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో గౌరవాన్ని అందుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వకోలు విజయలక్ష్మి పాల్గొన్నారు.

Read Previous

స్పందన ద్వారా శాశ్వత పరిష్కారం – కమిషనర్ జాహ్నవి

Read Next

బీర్ బాటిల్ విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేయండి – కలెక్టర్ ను కోరిన బిజేపి నేత రమేష్

Leave a Reply

Your email address will not be published.