Clock Of Nellore ( Nellore ) – మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు… సొంత తల్లి, చెల్లికి ప్రాధాన్యం ఇవ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలికే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఎద్దేవా చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ కు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే అర్హత లేదన్నారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు న్యాయం కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. సాక్షాత్తూ చెల్లెలు, వివేకా కుమార్తె సునీత న్యాయం కోసం నేటికీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. తన ప్రభుత్వంలో సొంత కుటుంబ సభ్యులకే న్యాయం జరిగే పరిస్థితి లేకపోతే ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎలా చెబుతారని అనురాధ ప్రశ్నించారు.
తెల్లవారు జాము నుండి అర్ధరాత్రి వరకూ ప్రజల కోసం పనిచేసే చంద్రబాబుకు… ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కేవలం ఇంటికే పరిమితమయ్యి పబ్ జీ గేములు ఆడుకునే జగన్మోహన్ రెడ్డికి పోలికేంటంటూ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో రోజా భజన చేస్తుంటే జగన్ మురిసి పోయాడని వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదన్న విషయం ఆమె గుర్తించాలని సూచించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనురాధ మండిపడ్డారు. మహిళా సమస్యలను ప్రశ్నిస్తే ఆమె వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. నల్లపరెడ్డి కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉందని ప్రసన్న ఆ కుటుంబంలో ఓ కలుపుమొక్క అని ధ్వజమెత్తారు. ఇక నుంచైనా ప్రసన్న కుమార్ రెడ్డి బాష మార్చుకోవాలని హితవు పలికారు.