Clock Of Nellore ( Nellore ) – జూన్ నెలాఖరుకల్లా నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తు పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. 2.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పెనుబర్తి రహదారి ఆధునీకరణ పనులను ఆయన ధనలక్ష్మీపురం కూడలి వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని నగర మేయర్ స్రవంతి, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల కారణంగా చాలా చోట్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆయా దారుల్లో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న కష్టాలను తాను స్వయంగా చూశానని చెప్పారు. రోడ్ల దుస్థితిని ముఖ్యమంత్రికి వివరించానని, ఆయన చొరవతో రోడ్లు భవనాల శాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల ఆధునీకరణ పనులన్నీ జూన్ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు నగరంతో అనుసంధానమయ్యే నెల్లూరు రూరల్ ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నింటిని 26 కోట్లతో ఆధునీకరిస్తున్నామని కోటంరెడ్డి తెలియజేశారు.
