Clock Of Nellore ( Nellore ) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు పధకం ద్వారా జగనన్న కాలనీల్లో పేదలందరికీ శాశ్వత గృహాలను నిర్మించే ప్రక్రియలో భాగంగా మౌళిక వసతుల కల్పనను వేగవంతం చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల పరిధిలోని లే అవుట్లలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సచివాలయం అమెనిటీ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ శాశ్వత గృహ హక్కు పధకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేజ్ కన్వెర్షన్ ప్రక్రియ పూర్తి చేసి తరువాతి దశకు నిర్మాణాలను తీసుకెళ్లాలని ఆదేశించారు. అర్హులైన కొంతమంది లబ్ధిదారులకు ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, గృహాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందజేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అత్యంత నాణ్యమయిన మెటీరియల్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు వినియోగించేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు.
