Clock Of Nellore ( Golagamudi ) – భగవాన్ వెంకయ్య స్వామి వారికి తొమ్మిదవ సారి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని కల్పించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరుజిల్లా, వెంకటాచలం మండలం, గొలగమూడిలోని భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ 40వ ఆరాధన మహోత్సవాలు సందర్భంగా ఉత్సవాలలో ప్రధానమైన ఆరాధనోత్సవంలో బుధవారం మంత్రి సతీ సమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోనే నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. అనంతరం స్వామి వారి రథోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సంధర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వెంకయ్య స్వామి వారి ఆశీస్సులతో వరుసగా 9వ సారి ఆరాధన ఉత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం తనకు కలిగిందని పేర్కొన్నారు. ఏపీకి జగన్ మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు బహుకరించే భాగ్యాన్ని కలిపించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశేష ఆదరణ పొందుతున్న శ్రీ వెంకయ్య స్వామి ఆలయం ఎంతో అభివృద్ది చెందడంతో పాటు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు సమకూరాయని మంత్రి వెల్లడించారు. ఆస్తుల పరిరక్షణకు ఈవో బాలసుబ్రమణ్యం, పాలకమండలి చిత్తశుద్ధితో పనిచేస్తుందంటూ అభినందనలు తెలిపారు. స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ మలోల, తహశీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ సుస్మిత, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
