Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో ప్రముఖ కూరగాయల విక్రయ కేంద్రంగా నడుస్తున్న నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మేయర్ కూరగాయల మార్కెట్ ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ దుకాణదారులతో మాట్లాడుతూ కూరగాయల వ్యర్ధాలను స్థానికంగానే పారబోయడంతో పశువుల సంచారం ఎక్కువవుతోందని, వ్యాపారస్తులంతా ఆ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. వినియోగదారులు దుకాణాల మధ్య సంచరించేందుకు ఇరుకుగా అనిపిస్తున్న కారణంగా, దుకాణాలను కాస్త వెనుకకు జరుపుకోవాలని మేయర్ ఆదేశించారు. స్వచ్ఛ నెల్లూరు సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించి, నగరానికి ఉత్తమ ర్యాంక్ వచ్చేలా కృషి చేయాలని మేయర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఏసు నాయుడు, 38 వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
