Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మరో విడత ఇంటింటికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ఆసక్తికరంగా సాగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. సమన్వయ కమిటీ సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, మిద్దె మురళీ కృష్ణ యాదవ్, షంషూద్దీన్ , మన్నేపల్లి రఘు, ఆర్ శ్రీనివాసులు, దిలీప్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాదయాత్ర కు సంబంధించి పలు అంశాలను చర్చించారు.
ఏప్రిల్ 11 నుంచి ఇంటింటికి కోటంరెడ్డి బాట ప్రారంభం…
ఏప్రిల్ 11 న గొల్ల కందుకూరు గ్రామం నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మే 10 వతేదీనా పొట్టే పాలెం వరకు సాగనుంది. నెల రోజుల పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ప్రాంతాల్లోని గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరించి వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నారు. ఆలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరించనున్నారు.
కార్యకర్తల నివాసంలోనే బస…
నెల రోజుల పాటు జరిగే జగనన్న మాట – కోటంరెడ్డి బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మరింత మమేకం కానున్నారు. కార్యకర్తల నివాసంలోనే అల్పాహారం, భోజనం చేయడంతోపాటు వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, వారి నివాసంలోనే బస చేయనున్నారు. నెల రోజుల వరకూ ఆయన సొంత నివాసంకు కూడా రాకుండా ప్రజల్లోనే ఉండనున్నారు. దీనికి సంబంధించి సమన్వయ కమిటీ ‘రూట్ మ్యాప్’ ను కూడా తయారు చేస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గా ఎన్నిక కాక ముందు నుంచి పాదయాత్రల ద్వారా ఆయన నెల్లూరు జిల్లాలోనే ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే ఎమ్మెల్యేగా ఆయన ముందు వరుసలో నిలిచారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తిరుగులేని విధంగా రూపొందించేందుకు ప్రతి అడుగు పడటంతో పాటు వ్యూహరచన జరుగుతోంది.