Clock Of Nellore ( Vidavaluru ) – ఎవ్వరైనా యానాదుల జోలికొస్తే సహించే ప్రసక్తే లేదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసి పెంచలయ్య హెచ్చరించారు. నెల్లూరుజిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరులో ఆయన పర్యటించి యానాదులకు కేటాయించిన సాల్ట్ వర్కర్క్ సొసైటీ భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊటుకూరులోని 70 యానాది కుటుంబాలకు 1981లో అప్పటి ప్రభుత్వం ఉప్పు పండించేందుకు గానూ ఒక్కొక్కరికీ ఎకరా చొప్పున మొత్తం 70 ఎకరాలు సొసైటీ యాక్ట్ కింద కేటాయించిందని చెప్పారు. వరద వల్ల ఆ భూముల్లో ఇసుక మేట వేయడంతో ఆర్ధిక ఇబ్బందుల నేపద్యంలో 70 యానాది కుటుంబాలు చేపల సాగుకు వాటిని లీజుకు ఇచ్చారన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి రాజకీయ కారణాలను చూపి యానాదుల భూమి ఆక్రమితమని చెప్పి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. యానాదుల భూముల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని కేసి పెంచలయ్య వెల్లడించారు.
