Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే పూర్తిగా అమలయ్యాయని, అవి కాకుండా అదనంగా కూడా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నెల్లూరులో మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ లో నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ ఛైర్మైన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, నుడా ఛైర్మైన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తో కలిసి జెండా ఊపి మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించే ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అనంతరం అదే బస్సులో మహిళలతో కలిసి మద్రాస్ బస్టాండ్, గాంధీ బొమ్మ, బోసుబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదుగా నవాబుపేట వరకూ మంత్రి ప్రయాణం చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. ఈ పథకం అమలు పట్ల మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని నారాయణ స్పష్టం చేశారు.
